మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళకు పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రోజూ తగినంత నీటిని తాగాలి. అలాగే తగినన్ని గంటల పాటు నిద్రించాలి. అయితే కరోనా నేపథ్యంలో టీకాలను తీసుకునే వారికి సైంటిస్టులు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. అదేమిటంటే…
సాధారణంగా రోజూ వ్యాయామం చేసేవారికి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారంలో కనీసం 5 రోజులు రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేసినా సరే డయాబెటిస్, స్థూలకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు గతంలోనే చెప్పారు. కానీ కోవిడ్ టీకాలను వేయించుకున్నవారు రోజూ వ్యాయామం చేయడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుందని తేల్చారు.
కోవిడ్ టీకాలను తీసుకుని రోజూ వ్యాయామం చేసే కొందరిని, వ్యాయామం చేయని వారిని రెండు గ్రూపులుగా విభజించి సైంటిస్టులు అధ్యయనాలు చేపట్టారు. దీంతో తేలిందేమిటంటే.. కోవిడ్ టీకాను తీసుకున్న తరువాత రోజూ వ్యాయామం చేసే వారిలో యాంటీ బాడీలు 50 శాతం ఎక్కువగా పెరిగాయని, అందువల్ల వారిలో కరోనా పట్ల రోగ నిరోధకత మరింత పెరిగిందని తేల్చారు.
కనుక కోవిడ్ టీకాలను తీసుకున్న వారు అవి మరిన్ని రెట్లు శక్తివంతంగా పనిచేయాలంటే రోజూ వ్యాయామం చేయాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి కోవిడ్ నుంచి రక్షణను అందిస్తాయి.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365