మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో బీన్స్ కూడా ఒకటి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు బీన్స్ను ఫాస్ట్ ఫుడ్ తయారీలో ఉపయోగిస్తుంటారు. కానీ బీన్స్ను చాలా మంది అంత ఇష్టంగా తినరు. బీన్స్తో మనం కూర, పులుసు, వేపుడు చేస్తుంటాం. అయితే బీన్స్ను ఆహారంలో భాగం చేసుకోవాలని, దీంతో అనేక లాభాలు కలుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. బీన్స్ను తరచూ తింటే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని వారు వెల్లడిస్తున్నారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని వారు అంటున్నారు.
బీన్స్ ను ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండువేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది.
బీన్స్ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్ను నియంత్రించవచ్చునని తెలిసింది. అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు.