ముగ్గు వేయడం అనే సంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం. అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. అప్పుడే.. ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం. ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు ఏ ఒక్కటీ మూఢనమ్మకం కాదు. ప్రతి ఆచారం వెనక అంతరార్థం ఉంది. ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు. ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది. వంగి లేవడం కారణంగా.. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని.. అందుకే రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారు.
మరి ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. గడప, గేటు ముందు ముగ్గు వేయాలి. ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగువైపు అడ్డగీతలు వేయాలి. ముగ్గు వేసిన తర్వాత చుట్టూ అడ్డగీతలు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లో రావు. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని శాస్త్రం చెబుతుంది. ముగ్గు వేశాక అడ్డగీతలు వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని సూచిస్తుంది. కాబట్టి పండుగల సమయంలో ఖచ్చితంగా వేయాలి. నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు దరిచేరకుండా చూస్తుంది. పద్మం ముగ్గు వేయడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరకుండా అరికడతాయి. కాబట్టి ముగ్గులు తొక్కరాదు.
అమ్మవారి పూజ చేసేటప్పుడు.. విగ్రహం పెట్టే పీట మీద ఖచ్చితంగా చిన్న ముగ్గు వేసి.. చుట్టూ రెండు రెండు గీతలు వేయాలి. తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి.. పూజ చేయాలి. ఆలయాల్లో, అమ్మవారి ముందు, మహావిష్ణువు ముందు ముగ్గులు వేసే స్త్రీలు 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు వేయరాదు. ఎందుకంటే వీటిని తొక్కరాదు కాబట్టి. పూర్వంలో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ముగ్గు లేని ఇంట్లో బిక్ష అడిగేవాళ్లు కాదట. ముగ్గు లేదంటే అశుభం జరిగిందని భావించేవాళ్లట. రోజూ ముగ్గు వేయలేక పెయింట్ ముగ్గు వేసుకుంటూ ఉంటారు. కానీ.. ఇలా చేయకూడదు. రోజూ ముగ్గు పెడితేనే మంచిది.