ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కొందరు స్పెషల్ సాంగ్స్లో నటించి, ఐదు నిమిషాలకే ఐదు కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. అయితే ఒక హీరోయిన్ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె మరెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ హాట్ బ్యూటీ ఒక టీవీ యాడ్లో కేవలం 50 సెకన్లు నటించి ఏకంగా రూ.5 కోట్లు సంపాదించింది. నయనతారకు దాదాపు 40 ఏళ్ల వయసు వచ్చినా, 25 ఏళ్ల హీరోయిన్లా చాలా ఫిట్గా, అందంగా కనిపిస్తోంది. నిజానికి ఆమె ఎప్పుడూ నటి కావాలనుకోలేదట. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని కలలు కన్నదట. కానీ అనుకోకుండా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం, ఆపై స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదగడం జరిగిపోయింది..
కెరీర్ ప్రారంభంలో నయనతారకు కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆఫర్లు కూడా రాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె చాలా బలంగా కంబ్యాక్ ఇచ్చింది. క్రమంగా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్గా అవతరించింది. చాలా పెద్ద సినిమాల్లో ఆమెకు హీరోయిన్ ఛాన్స్లు వచ్చాయి. 2023లో నయనతార షారూఖ్ ఖాన్తో కలిసి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిలిం జవాన్లో నటించింది. ఈ మూవీ తర్వాత ఆమె భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారింది. టాటా స్కై యాడ్కు 50 సెకన్ల కోసం ఆమె రూ.5 కోట్లు తీసుకుంది. నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటుందని సమాచారం.
నయనతార కెరీర్ స్టార్టింగ్లో కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. 2006లో వచ్చిన వల్లవన్ (తెలుగులో వల్లభ) సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ కొన్ని నెలల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. వారి ప్రైవేట్ ఫొటోలు కూడా లీక్ అయ్యాయి, అది అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. ఈ బ్యూటీ ప్రభుదేవాతో దాదాపు మూడున్నర సంవత్సరాలు ప్రేమలో ఉంది. 2009లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్ నడిచింది కానీ, ఆ తర్వాత వీరు విడిపోయారు. 2015లో నానుమ్ రౌడీ ధాన్ సినిమా చేస్తున్నప్పుడు నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ని కలిసింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత సరోగసీ ద్వారా వీరికి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు.