Banana Bobbatlu : అర‌టి పండ్ల‌తో బొబ్బ‌ట్లు.. ఇలా 10 నిమిషాల్లో టేస్టీగా చేయ‌వ‌చ్చు..!

Banana Bobbatlu : మ‌నం వంటింట్లో ఎక్కువ‌గా త‌యారు చేసే తీపి వంట‌కాల్లో బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన వెరైటీ బొబ్బ‌ట్ల‌లల్లో అర‌టిపండు బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. అర‌టిపండుతో చేసే ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ అర‌టిపండు బొబ్బట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అర‌టిపండు బొబ్బ‌ట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఉప్పు – చిటికెడు, ప‌సుపు – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు – 10, బాదంప‌ప్పు – 10, యాల‌కులు – 3, అర‌టిపండ్లు – 3, బొంబాయి ర‌వ్వ – పావు క‌ప్పు, బెల్లం తురుము – అర క‌ప్పు.

Banana Bobbatlu recipe very tasty
Banana Bobbatlu

అర‌టిపండు బొబ్బ‌ట్ల త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని, ఉప్పు, ప‌సుపును వేసి క‌లుపుకోవాలి. త‌రువాత నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో జీడిప‌ప్పు, బాదంప‌ప్పు, యాల‌కులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో అర‌టిపండ్లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి.

త‌రువాత ర‌వ్వ వేసి వేయించాలి. ర‌వ్వ వేగిన త‌రువాత అర‌టిపండ్ల మిశ్ర‌మం వేసి 3 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించాలి. త‌రువాత బెల్లం వేసి క‌రిగే వ‌రకు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న జీడిపప్పు పొడి వేసి క‌ల‌పాలి. దీనిని క‌లుపుతూ ద‌గ్గ‌ర ప‌డే ఉడికించాలి. ఈ మిశ్ర‌మం క‌ళాయికి అంటుకోకుండా వేర‌య్యే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత పావు టీ స్పూన్ ప‌సుపు మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ముందుగా క‌లిపిన పిండిని మ‌రోసారి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత నిమ్మ‌కాయంత పిండిని తీసుకుని ముందుగా గిన్నెలాగా వ‌త్తుకోవాలి.

త‌రువాత ఇందులో అర‌టిపండు మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌ను మూసివేయాలి. త‌రువాత దీనిని పిండి చ‌ల్లుకుంటూ బొబ్బ‌ట్ల లాగా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ బొబ్బ‌ట్టును వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. త‌రువాత నెయ్యి వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అర‌టిపండు బొబ్బ‌ట్లు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా అర‌టిపండ్లు, గోధుమ‌పిండితో బొబ్బట్ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts