ఇప్పుడంటే చాలా మంది జంక్ ఫుడ్కు అలవాటు పడిపోయి మనం సంప్రదాయంగా చేసుకునే పిండి వంటలను చేయడం లేదు. కానీ ఒకప్పుడు మన ఇళ్లలో ఇవి ఎల్లప్పుడూ ఉండేవి. పిల్లలు చిరు తిండి కావాలని మారాం చేసినా, పండగలు వచ్చినా, శుభ కార్యాల సమయంలోనూ చాలా మంది పిండి వంటలను చేసేవారు. ఇక అలాంటి పిండి వంటల్లో పూర్ణం బూరెలు కూడా ఒకటి. కాస్త శ్రమ, ఓపిక ఉండాలే కానీ ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలను ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసి తినవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
పూర్ణం బూరెల తయారీకి కావలసిన పదార్ధాలు..
శనగ పప్పు – పావుకిలో, బెల్లం లేదా చక్కెర – పావుకిలో, మినప పప్పు – అర్థపావుకిలో, మెత్తని బియ్యం పిండి – పావుకిలో, ఎండు కొబ్బరి ముక్కలు, ఏలకులు – తగినన్ని.
పూర్ణం బూరెలను తయారుచేయు విధానం..
బూరెలు వండడనికి మూడు గంటలు ముందుగా చోవి (బూరె పైన తొక్క కోసం) తయారుచేసుకోవాలి. దీనికోసం మినప పప్పు నానబెట్టి, గంటతర్వాత మెత్తని కాటుకలా రుబ్బి, ఆ రుబ్బినపిండిలో బియ్యపు పిండి పోసి కలిపి, చిటికెడు ఉప్పు వేసి గిన్నె మీద మూతపెట్టి ఉండనివ్వాలి. ఈ పిండిని కనీసం మూడు గంటలన్నా నానబెట్టాలి. శనగ పప్పు తక్కువ నీరుపోసి బాగా ఉడకనివ్వాలి. పప్పు చేతితో పట్టుకొని నొక్కి చూస్తే చితికిపోవాలి. తర్వాత పప్పులో నీరుగనక ఉంటే వంచేసి తరిగిన బెల్లం లేక చక్కెర పోసి ఉడకనివ్వాలి. ఈ మాదిరిగా పాకం పెట్టడం వల్ల బూరెలు రెండురోజులున్నా చెడిపోవు. ఏలకులు వొలిచి గింజలు పొడుంలాగా దంచుకోవాలి. కొబ్బరి సన్నంగా ముక్కలు తరిగి నేతిలో చేయించుకోవాలి.
పాకం గిన్నెలోని పప్పుని గరిటెతో బాగా కుమ్మి, అందులో ఏలకులపొడి, కొబ్బరిముక్కలు వేసి, నేతితో బాగా కలిసేటట్లు పిసికి, తరువాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి, నూనె మరిగాక, ఒక్కొక్క పూర్ణపు ఉండ సిద్ధంగా ఉంచుకున్న చోవిలో ముంచి, నూనెలోవేసి, ఎర్రగా వేగాక తీసి విడిగా పెట్టుకోవాలి. బూరెచోవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. బూరె చోవిలో బియ్యం పిండి ఎక్కువ కలిపితే, వేగాక బూరెలు పైన కరకరలాడుతూ ఉంటాయి. మినప పిండి ఎక్కువ కలిపితే చల్లారిన తర్వాత మెత్తబడి సాగుతాయి. ఇలా ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలను తయారు చేయవచ్చు.