Mushroom Gravy : రెస్టారెంట్ల‌లో ల‌భించే మ‌ష్రూమ్ గ్రేవీ.. ఇలా చేస్తే టేస్ట్ సూప‌ర్‌గా ఉంటుంది..!

Mushroom Gravy : మ‌ష్రూమ్ గ్రేవీ క‌ర్రీ.. పుట్ట‌గొడుగుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎందులోకైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎక్కువ‌గా ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మ‌ష్రూమ్ గ్రేవీ క‌ర్రీని రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ష్రూమ్ గ్రేవీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, త‌రిగిన పుట్ట‌గొడుగులు – 200 గ్రా., త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నీళ్లు – ముప్పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mushroom Gravy recipe in telugu make it in restaurant style
Mushroom Gravy

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4,యాల‌కులు – 2, ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌లు – పావు కప్పు, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ట‌మాట – 1, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్.

మ‌ష్రూమ్ గ్రేవీ త‌యారీ విధానం..

ముందుగా మ‌సాలా పేస్ట్ కోసం కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నింటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి.త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిక‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత పుట్ట‌గొడుగులు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి అంతా క‌లిసేలా క‌లపాలి.

త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి ఉడికించాలి. దీనిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ముక్క‌లు చ‌క్క‌గా ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ష్రూమ్ గ్రేవీ క‌ర్రీ త‌యార‌వుతుంది. ఈ క‌ర్రీని అన్నం, చ‌పాతీ, బిర్యానీ, రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మ‌ష్రూమ్ గ్రేవీ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts