నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మరెన్నో పోషకాలు కూడా నిమ్మకాయలో ఉన్నాయి. అయితే రోజులో ఏదో ఒక సమయంలో కన్నా ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా? తెలీదా? అయితే తెలుసుకుందాం రండి. పురుషులకైతే నిత్యం 75 ఎంజీ మోతాదులో, స్త్రీలకైతే నిత్యం 90 ఎంజీ మోతాదులో విటమిన్ సి అవసరం అవుతుంది. ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని ఒక గ్లాస్ మోతాదులో తాగితే మనకు దాదాపు 30.7 ఎంజీ విటమిన్ సి లభిస్తుంది. దీని వల్ల మన శరీర రోగ నిరోధక వ్యవస్థ, జీర్ణాశయం సక్రమంగా పనిచేస్తాయి.
నిమ్మరసాన్ని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పంపబడతాయి. అజీర్ణం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దకం పోతుంది. పైత్య రసం సరిగ్గా విడుదలయ్యేలా చూస్తుంది. జలుబు, ఫ్లూ జ్వరం వంటి అనారోగ్యాలు తగ్గిపోతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగిన అనంతరం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమవడంతో మనకు శక్తి పూర్తిగా అందుతుంది. ఇది ఆ రోజంతా మనల్ని ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. నిమ్మరసం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
లెమన్ వాటర్లో బాక్టీరియాలు, వైరస్లు తదితర ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనకు అనారోగ్యాలు కలగకుండా చూస్తాయి. పొటాషియం, మెగ్నిషియం వంటివి ఎక్కువగా ఉండడం వల్ల మెదడు పనితనం మెరుగు పడుతుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. లెమన్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం చేత పలు రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకోవచ్చు.