సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే మనకు పలు రకాల సమస్యలు వస్తుంటాయి. అయితే చలికాలంలో శ్వాసకోశ సమస్యలతోపాటు జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి. మలబద్దకం వస్తుంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు కొందరు చలికి తట్టుకోలేకపోతుంటారు. అలాంటి వారు ఈ సీజన్లో కింద తెలిపిన ఆహారాలను తీసుకోవాలి. దీంతో చలి నుంచి బయట పడడమేకాదు, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే జీర్ణ సమస్యలు ఉండవు. మరి ఈ సీజన్లో తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే..
1. ఈ కాలంలో జొన్నలను కనీసం వారంలో ఒకసారి అయినా తీసుకోవాలి. జొన్న గడక, జొన్న రొట్టె, అన్నం రూపంలో జొన్నలను తినవచ్చు. దీంతో మన శరీరానికి కాల్షియం బాగా లభిస్తుంది. దీనివల్ల కండరాలు బిగుసుపోకుండా వాటి కదలికలు చక్కగా ఉంటాయి. ఈ కాలంలో ఇది మనకు మేలు చేస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పలు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. ఈ కాలంలో మనకు చిలగడ దుంపలు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని పోగొడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్న వారు వీటిని తింటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. విటమిన్ ఎ, సి, మాంగనీస్, కాపర్ వంటివి అధికంగా ఉండడంతో శరీరానికి పోషకాలు అందుతాయి. ఇవి ఈ కాలంలో మనకు ఎంతగానో అవసరం. చిలగడ దుంపలను ఉడికించి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని అలాగే తినవచ్చు. లేదంటే కూర రూపంలోనూ తీసుకోవచ్చు. కొందరు వీటిని పచ్చిగానే తినేస్తారు. వీటిని తినడం వల్ల శరీరం వెచ్చగా కూడా ఉంటుంది.
3. చలి కాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల నుంచి దానిమ్మ మనకు రక్షణనిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది. ఈ సీజన్లో తినదగిన పండ్లలో దానిమ్మ ఒకటి.
4. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈ కాలంలో మనకు సంక్రమించే వ్యాధుల నుంచి కాపాడతాయి. అంతేకాకుండా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తం పెరగడానికి దోహద పడుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. కండరాలు సులభంగా కదులుతాయి. బిగుసుకోవు. ప్రతి రోజూ పాలకూరను తింటుంటే సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
5. చలికాలంలో రాత్రే కాదు పగటి పూట కూడా వాతావరణం చల్లగానే ఉంటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత క్రమబద్దంగా ఉండదు. అయితే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో వేడి పెరిగి శరీర ఉష్ణోగ్రత ఒకే లెవల్లో ఉంటుంది. ఇలా ఉండడం మనకు ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నిషియం, కాపర్ వంటి పోషకాలు ఎన్నో మనకు లభిస్తాయి. ఇవి ఈ కాలంలో మనకు ఎంతగానో అవసరం అవుతాయి. నువ్వులను తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి రక్షణ లభించడంతోపాటు శరీరం వెచ్చగా ఉంటుంది. చలిని అడ్డుకోవచ్చు.
6. విటమిన్ ఇ, బి3 వంటి పోషకాలు వేరుశెనగల్లో ఉంటాయి. అంతేకాదు మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. చర్మంలో తేమ శాతాన్ని పెంచే గుణం ఉండడం వల్ల చలి కాలంలో మన చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. రోజూ గుప్పెడు వేరుశెనగలను నీటిలో నానబెట్టి తింటే మంచిది.
7. ఆప్రికాట్స్, ఖర్జూరం, అంజీర్, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ వంటి పలు రకాల ఎన్నో డ్రై ఫ్రూట్స్, నట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి అన్ని కాలాల్లోనూ మనకు లభిస్తాయి. అయితే ప్రత్యేకంగా వీటిని చలికాలంలో తింటేనే మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మెదడు యాక్టివ్గా ఉండదు. బద్దకంగా అనిపిస్తుంటుంది. కనుక నట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. రోజంతా ఉత్తేజంగా ఉండవచ్చు. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్ ఎ, బి, సి, మోనో అన్శాచురేటెడ్ ఫ్యాట్లు మనకు లభిస్తాయి. ఇవన్నీ ఈ కాలంలో మన శరీరానికి అత్యంత అవసరమైన కీలక పోషకాలు. కనుక ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరం వేడిగా కూడా ఉంటుంది.