Cracked Heels : చలికాలంలో సహజంగానే చర్మం పగులుతుంటుంది. చేతులు, కాళ్లపై చర్మం పగిలి దర్శనమిస్తుంది. దీంతో చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకునేందుకు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. అయితే కాళ్లు, చేతులపై చర్మాన్ని మృదువుగా మార్చుకోవడం సులభమే. కానీ చలికాలంలో చాలా మందికి పాదాలు పగులుతాయి. ఏం చేసినా.. ఏ చిట్కాను పాటించినా.. పాదాల పగుళ్లు అనేవి తగ్గవు. దీంతో ఇబ్బందులు పడుతుంటారు.
పాదాలు చలికాలంలో సహజంగానే పగులుతాయి. కానీ కొందరికి పలు ఇతర కారణాల వల్ల కూడా పాదాలు మరీ ఎక్కువగా పగులుతుంటాయి. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
1. నువ్వుల నూనెను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. దాన్ని పాదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రి పూట ఇలా చేసి పాదాలకు సాక్సులను తొడగాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే పాదాల పగుళ్లు తగ్గిపోయి పాదాలు అందంగా కనిపిస్తాయి.
2. బియ్యం పిండి, యాపిల్ సైడర్ వెనిగర్, తేనెలను కలిపి మిశ్రమంగా చేసి దాన్ని పాదాలపై రాయాలి. సున్నితంగా మసాజ్ చేయాలి. తరువాత నీళ్లతో కడిగేయాలి. అనంతరం నూనె లేదా ఫుట్ మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా చేస్తుంటే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.
3. రాత్రి నిద్రకు ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాయాలి. అనంతరం సాక్సులను తొడగాలి. ఈవిధంగా చేయడం వల్ల కూడా పాదాల పగుళ్లు తగ్గుతాయి.
4. రాత్రి పూట పాదాలకు కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. అనంతరం సాక్సులను తొడగాలి. మరుసటి రోజు ఉదయాన్నే పాదాలను కడిగేయాలి. ఇలా చేస్తుంటే పాదాలు అందంగా మారుతాయి.
5. కొందరికి శరీరంలో వేడి బాగా ఉండడం వల్ల లేదా పౌష్టికాహార లోపం వల్ల కూడా పాదాలు పగులుతుంటాయి. అలాంటి వారు రోజూ పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. సీజనల్గా లభించే పండ్లతోపాటు నట్స్ను ఎక్కువగా తినాలి. దీంతో పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.