ఇరాన్ బాహ్య ప్రపంచానికి తెలియకుండా, చెప్పకుండా రహస్య అణు శక్తి ఎజెండాను చేపట్టిందని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాల అనుమానం, అందుకు తగ్గట్టుగానే, భూగర్భ న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మించి ప్రయోగాలు, పరీక్షలు చేస్తున్నట్టు అంతర్జాతీయ అణు పర్యవేక్షక సంస్థ ధృవీకరించింది. ఇవి కనక సఫలమైతే విరోధ దేశాలన్నింటినీ ఇరాన్ దుందుడుకుగా చీల్చి చెండాడుతుంది, ఈ పరిస్థితికి ముందుగా బలయ్యేది ఇజ్రాయెల్, ఆ తరవాత వరసగా ఇస్లామిక్ దేశాలు, అవన్నీ కేవలం రెండు మూడు వేల కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి, అణ్వాయుధాలు ఒకసారి చేతికి వస్తే అవి పిచ్చి వాని చేతిలో రాయిలా మారతాయి అని ప్రపంచం మొత్తం భయ పడుతుంది. మేము అటామిక్ బాంబ్స్ తయారు చేసి మిమ్మల్ని ఈ భూగోళం మీద లేకుండా సర్వ నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ని హడలెత్తిస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటారా?
ఇస్లామిక్ దేశాలు అయినంత మాత్రాన అన్నీ ఒకే విధంగా ఆలోచిస్తాయి అనుకోరాదు, ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి, న్యూక్లియర్ టెక్నాలజీ వంటి విషయాల్లో పరస్పర సంఘీభావం వంటివి ఏమీ ఉండవు. ఈ యుద్ధంలో కేవలం మత కోణమే కాదు, చారిత్రక, ప్రాంతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధి వంటి కోణాలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ తాము న్యూక్లియర్ శుద్ధి రంగంలో చాలా పురోగతి సాధించామని గొప్పలు చెప్పుకుంది, ఇంకేముంది పాక్ ఆధ్యర్యంలో ఇస్లామిక్ బాంబు తయారవుతోంది అంటూ మత ఛాందస వర్గాలు అత్యుత్సాహంతో ప్రచారం చేశాయి, అదంతా ఇండియాని అదరగొట్టి, బెదరగొట్టే ఎత్తుగడలో భాగం, అంతకు మించి ఏమీ లేదు. 1980 దశకంలో రెండు ముస్లిం దేశాలైన ఇరాన్( షియా), ఇరాక్ ( సున్నీ) మధ్య ఐదారేళ్ళు భీకర యుద్ధం జరిగింది, అది ముస్లింలలోనే ముఖ్య వర్గాల మధ్య సంఘర్షణ అని కూడా అనుకున్నారు, అప్పటి ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ పంతానికి పోయి వేల మందిని రణక్షేత్రంలో బలి పెట్టాడు.
తిరిగి 1990 దశకంలో అరబిక్ పండితుల చేత కాకి పురాణాలు చెప్పించి చారిత్రకంగా కువైట్ దేశం ఇరాక్ లో అంతర్భాగం అని వాదించి కబళించాలని చూశాడు, గల్ఫ్ యుద్ధంగా చెప్పుకునే ఆ రణరంగంలో అక్షరాలా కనీసం ఐదు లక్షల మంది చనిపోయినట్టు అంచనా, దుర్మార్గ రాక్షసుడు సద్దాం. ఇలాంటి ఉన్మాద ఆలోచనల మధ్య ప్రపంచం అణ్వస్త్ర రహితం కావాలని, సుస్థిర శాంతి, భద్రత ఉండాలని ఇప్పటికే అణ్వాయుధాలు కలిగిన దేశాలు కూడా కోరుకుంటాయి. అందుకే అగ్రరాజ్య మైన అమెరికా సహా సంపన్న , ప్రవృద్ధ దేశాలన్నీ ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర మెరుపు దాడుల్ని సమర్థిస్తూ ఉంటాయి, ప్రస్తుతానికైతే ఇరాన్ కు మద్దతుగా రెండు ముస్లిం దేశాలైన పాకిస్తాన్, టర్కీ లు ముందుకొచ్చాయి, అమెరికా మాట వినకుండా పాక్ ఎంత వరకూ నిలబడుతుందో డౌటే. అణు శక్తి అనేది అటు మంచికీ, ఇటు చెడుకీ ఉపయోగించగల రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటిది, దాన్ని శాంతి యుత మంచి ప్రయోజనాలకే ఉపయోగిస్తున్నామని ప్రపంచాన్ని నమ్మించే బాధ్యత ఇరాన్ పైనే ఉంటుంది.
అలా కాదని ఠలాయిస్తే….. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అన్నట్టు ఇరాన్ ను ఎవరో ఒకరు ముందుకొచ్చి అదుపు చేయక తప్పదు, ఈ క్రమంలో ఆస్తి నష్టం, జన నష్టం జరగక తప్పదు, అందుకు ముస్లిం దేశాలు సహా యావత్ ప్రపంచ దేశాలు అన్నీ మద్దతు పలుకుతాయి.