కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల విరాళం ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్.
భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్కి, కుమార్తెలకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో విజయన్ రూ.4 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు, పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీరేణుకాంబాల్ అమ్మవారి ఆలయ హుండీలో వేసేశాడు.
కష్టపడి సంపాదించిన ఆస్తుల విషయంలో తన కుమార్తెలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను ఇచ్చేయాలంటూ విజయన్ కుమార్తెలు ఆలయ అధికారులను సంప్రదించారు. విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని, నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.