విటమిన్ డి మన శరీరానికి అవసరం ఉన్న అనేక విటమిన్లలో ఒకటి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే భారతీయుల్లో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొత్తం భారతీయుల్లో 76 శాతం మందిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించారు.
దేశంలోని 81 నగరాల్లో 229 కేంద్రాల్లో 4,624 మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు. దీంతో తేలిందేమిటంటే.. వారిలో 76 శాతం మందిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సదరు అధ్యయనానికి చెందిన వివరాలను జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆర్థోపెడిక్స్లోనూ ప్రచురించారు.
ఈ సందర్భంగా అధ్యయనాన్ని రచించిన గార్డియన్ హాస్పిటల్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ సంజీవ్ గోయెల్ ఈ సందర్బంగా మాట్లాడుతూ భారతదేశంలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని, ఇది తీవ్ర సమస్యగా మారిందని అన్నారు. మన శరీరంలో కండరాలు, ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి దోహదపడుతుందని తెలిపారు. విటమిన్ డి లోపంతో చాలా మంది బాధపడుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు.
కాగా నిత్యం ఉదయాన్నే 30 నుంచి 45 నిమిషాల పాటు సూర్య రశ్మి తాకే విధంగా శరీరాన్ని ఎండలో ఉంచితే మనకు కావల్సినంత విటమిన్ డి లభిస్తుందని తెలిపారు. అలాగే చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, పాలు, పాల సంబంధ ఉత్పత్తుల్లోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుందని, వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుందని తెలిపారు. అయితే విటమిన్ డి కావాలనుకుంటే డాక్టర్ సలహా మేరకు నిత్యం విటమిన్ డి ట్యాబ్లెట్లను కూడా వాడుకోవచ్చని సూచించారు.