మనలో చాలా మంది మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత నిద్రిస్తుంటారు. కొందరు 30-60 నిమిషాల పాటు నిద్రిస్తారు. ఇంకొందరు మధ్యాహ్నం చాలా సేపు నిద్రిస్తారు. అయితే మధ్యాహ్నం నిద్ర శరీరానికి మంచిదేనా ? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు ? దీని వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుందా ? నష్టం ఏమైనా ఉంటుందా ? అంటే…
మధ్యాహ్నం భోజనం అనంతరం 20-30 నిమిషాల పాటు నిద్ర పోవచ్చు. అది మంచిదే. ఇలా నిద్రించడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. అంతెందుకు.. సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ తన కార్యాలయాల్లో ఉద్యోగులకు స్లీపింగ్ పాడ్స్ ను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత లేదా ఇతర సమయాల్లో ఉద్యోగులు నిద్రించేందుకు అలా ఏర్పాటు చేసింది. దీని వల్ల ఉత్పాదకత సామర్థ్యం పెరగుతుంది. అంటే.. ఎక్కువగా పనిచేయగలుగుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. అందుకనే గూగుల్ ఆ ఏర్పాటు చేసింది. కనుక మధ్యాహ్నం గరిష్టంగా 30 నిమిషాల పాటు నిద్రించడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయని చెప్పవచ్చు.
అయితే ఏది అయినా అతి పనికిరాదన్నట్లు మధ్యాహ్నం నిద్ర కూడా ఎక్కువగా పోవడం మంచిది కాదు. అలా చేస్తే నిద్ర నుంచి మేల్కొన్నా ఇంకా మగతగానే ఉంటుంది. ఉత్పాదకత తగ్గుతుంది. ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాలు పడుతాయి. కనుక మధ్యాహ్నం పరిమిత సమయం పాటు నిద్రించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోజనాలు కలుగుతాయి.
ఇక మధ్యాహ్నం 30 నిమిషాల పాటు నిద్రించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అప్రమత్తత పెరుగుతుంది. అందుకనే కొరియా, జపాన్ వంటి దేశాల్లోనూ ఉద్యోగులకు కంపెనీలు పవర్ న్యాప్ అనే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే మధ్యాహ్నం కొంత సేపు వారు కునుకు తీస్తారన్నమాట. కాబట్టి ఇలా చేస్తే ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365