బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో.. ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. 41 రోజులు దీక్ష చేసిన వాళ్లు మాత్రమే ఈ పదునెట్టాంబడి అంటే 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు. అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తాయి. అలాగే.. స్పర్శ జపమాల ద్వారా ఎప్పుడూ ఆ దైవనామస్మరణలో ఉండాలని తెలుపుతుంది. 5 మెట్ల తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంబంనుసూచిస్తాయి.
ఈ అష్టరాగాలు చక్కటి సందేశాన్ని ఇస్తాయి. మనుషులు అహంకారాన్ని విడనాడి, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. చెడు మార్గంలో వెళ్తున్నవాళ్లకు మంచి మార్గంలో వెళ్లాలని సూచించాలి. తర్వాత మూడు మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలు.. బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి. చివరి రెండు మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానం పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.
శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కిన వాళ్లు జ్ఞానంతో పాటు సంపద పొంది జీవితంలో పరిపూర్ణులవుతారని ఒక నమ్మకం ఉంది. 18 మెట్లు ఎక్కేటప్పుడు తలపై ఇరుముడి పెట్టుకోవాలి. ఈ ఇరుముడిని దేవాలయంలో ఇచ్చి.. ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శబరిమల ఆలయంలో స్వామి దర్శనానికి మాత్రమే కాదు.. ఆయన ఆలయానికి చేరుకోవాలన్నా.. 18 కొండలు దాటాలి. అంటే అయ్యప్ప ఆలయం 18 కొండలపై, అయ్యప్ప దర్శన భాగ్యం 18 మెట్లపై కలుగుతుంది.