భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం. గోవు పాలు, మూత్రము, పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల గోవును దానం చేస్తే ఏడు తరాలను తరింపజేస్తుంది. గోదానం చేస్తే పితృ దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి స్వర్గానికెళతారని శాస్త్రంలో చెప్పబడింది. ఆషాడ శుద్ద ఏకాదశి (తొలి ఏకాదశి) రొజున గో పద్మ వ్రతం చేస్తే అత్యంత విశేష ఫలితం కల్గుతుందని పురాణాల్లో చెప్పబడింది. ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద చూడలేదు అని చ్యవన మహర్షి నహుషంలో ప్రవచించారు.
చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్రగ్రంథాలలోను, భారత, రామాయణ, భాగవతాది పవిత్రగ్రంథాలలోను, గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు, బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, గురు నానక్, శంకరాచార్యులు తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభువు మొదలగు మహానుభావులెందరో గోసంపద రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు. శ్రీకృష్ణ్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలుడైనాడు. దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు. గోవులే స్వర్గ సోపానాలు. శ్రీ కృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తి తో… శ్రద్ధతో సేవకుడిగా చూసుకొనేవాడు. ఎవరైతే గోవును అమిత భక్తితో పూజించిన ముక్తికి పొందెదరు.
గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది. అందుకనే గోవును పవిత్రమైనదిగా హిందువులు పూజిస్తారు.