ఈమధ్య చాలా మందిని వేధిస్తోన్న సమస్య అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టకపోవడం. ఫోన్, టీవీ వంటి రకరకాల వ్యాపకాల వల్ల చాలామంది నిద్రకు సరైన వేళలు పాటించడం లేదు. క్రమంగా ఈ తీరు నిద్రలేమికి కారణం అవుతుంది. దాన్ని అధిగమించాలంటే పడుకోవడానికి గంట ముందు ఆహారం తీసుకోవాలి. ఓ ఆరగంట ముందుగా ఫోన్ ని దూరం పెట్టాలి. వీలుంటే అసలు బెడ్ రూమ్ లోకే ఫోన్ తీసుకురాకుండా ఉండేలా సెల్ఫ్ రూల్ పెట్టుకోవాలి. పడుకునే ముందు పాలు తాగే అలవాటు చేసుకోవాలి. గోరువెచ్చని పాలు హాయిగా నిద్ర పోయేందుకు దోహదం చేస్తాయి. కండరాలకూ బలం కూడా.
గదంతా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. శబ్దాలూ, వెలుతురు రాకుండా కిటికీలకు మందపాటి కర్టెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం డార్క్ కలర్ కర్టెన్స్ అయితే బెటర్. ఈ జాగ్రత్తల వల్ల నిద్ర పడుతుంది. నిద్రకు భంగం కూడా కలగదు. నిద్రవిషయంలో తప్పనిసరిగా టైమింగ్స్ పాటించాలి. అప్పుడే అలారంతో పని లేకుండా దినచర్య మొదలవుతుంది. పైగా అలారం పెట్టుకోవడం వల్ల నిద్ర మీద ప్రభావం పడుతుంది. అలా లేకుండా క్రమశిక్షణ విషయంలోనూ అలవాటు చేసుకోవాలి.
ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. రేపు ఏం చేయాలి అనే ఆలోచనలు నిద్ర సమయంలో చేయకపోవడం మంచిది. లేదంటే ఒత్తిడిగా అనిపించి నిద్ర పట్టదు. అలాకాకుండా ముందస్తు టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి.
నిద్రపోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంటే ఓ పది నుంచి పదిహేను నిమిషాలు ధ్యానం చేసి చూడండి. త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది.