వంటకం ఎంత రుచిగా వున్నప్పటికి కొంతమంది దానిలో మరి కొంచెం ఉప్పు వేసుకుని మరీ ఆనందంగా తినేస్తారు. ఉప్పు అధికం అయితే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఉప్పు శరీరం సక్రమంగా పనిచేయటానికి అవసరమే కాని, అధికం అయితే ప్రమాదం. ఉప్పు అధికం అయితే, రక్తపోటు, గుండెజబ్బులు వస్తాయి. కనుక మనం ఉప్పు అధికంగా తింటున్నామా? లేక తగిన పాళ్ళలోనే తింటున్నామా అని తెలుసుకోడానికి కొన్ని చిట్కాలు చూడండి.
ఉప్పు అధికంగా తింటే రక్తంలో సోడియం పెరుగుతుంది. ఈ అసమతుల్యత కిడ్నీలు శరీరంనుండి నీటిని బయటకు పంపటానికి అసౌకర్యం కలిగిస్తుంది. శరీరంలో ఆగిన నీటి కారణంగా రక్తనాళాలపై ఒత్తిడిపడి రక్తపోటు వస్తుంది. రక్తపోటు గుండె, బ్రెయిన్, కిడ్నీ విఫలత మొదలగు వ్యాధులకు కారణమవుతుంది. శరీరంలో అధిక ఉప్పు వుంటే, దానిని రక్తంలో కలపటానికి శరీరానికి అధిక నీరు కావాలి. అందుకని మీరు దాహంగా ఉన్నట్లు భావిస్తారు.
ఉప్పు అధికమై శరీరంలో నీరు లేకుంటే శరీర భాగాలు ఉబ్బుతాయి. మూత్రం సరిగా రాదు. ఉప్పు అధికం కాగానే కిడ్నీలు మూత్రాన్ని ఆపుతూ ఆ నీటిని ఉప్పు కొరకు ఉపయోగిస్తాయి. ఫలితంగా మూత్రం పోసేటపుడు మంట వస్తుంది. ఈ చిహ్నాలు మీలో కనపడితే మీరు ఉప్పు అధికంగా తింటున్నట్లే. పరిష్కారంగా ప్రతిరోజూ నీటిని అధికంగా తాగడం, ఉప్పు అధికంగా వుండే ప్యాకేజ్ ఆహారాలు మానటం చేయాలి. తాజా పండ్లు, కూరలు తినాలి.