అసిడిటీ సమస్య అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. చాలా మందికి ఈ సమస్య వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కారం, మసాలాలు ఉండే ఆహారాలను అధికంగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, నూనె ఉండే పదార్థాలను ఎక్కువగా తినడం, మద్యం సేవించడం, పొగ తాగడం, మందులను వాడడం వంటి అనేక కారణాల వల్ల అసిడిటీ వస్తోంది. అయితే ఇందుకు పలు ఇంటి చిట్కాలను పాటిస్తే సమస్య నుంచి వెంటనే బయట పడవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటంటే..
ఏం తిన్నా గొంతులో పట్టేసినట్లుంటుందా? కారం తింటే కడుపు మంట పుడుతుంటే మీకు ఎసిడిటీ ఉన్నట్లే. ఇలాంటప్పుడు తక్షణమే కొన్ని పనులు చేసి ఉపశమనం పొందొచ్చు. పరగడుపున నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగాలి. పుదీనాలో ఉండే ఔషధ గుణాలు ఎసిడిటీని తగ్గిస్తాయి. భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎసిడిటీ రాదు.
అరటిపండులో అధికంగా పొటాషియంతో పాటు నేచురల్ ఆంటాసిడ్స్ ఉండి గుండె మంట నుంచి ఉపశమనం కల్పిస్తాయి. జీర్ణకోశం శుభ్రపర్చడానికి కూడా అరటిపండు ఉపయోగపడుతుంది. చల్లని పాలలో ఒక చెంచా తేనె చేర్చి తీసుకోవడం వల్ల ఛాతిలో, కడుపులో మంట తగ్గుతుంది. రెండు లవంగాలను నోట్లో వేసుకొని నమిలి మింగడం వల్ల ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.