వజ్ర వైఢూర్యాలతో, మరకత మణి మాణిక్యాల నడుమ తులతూగే శ్రీవేంకటేశ్వరుడు రోజూ స్వీకరించే ప్రసాదం తయారు చేసే పాత్ర ఏమై ఉంటుంది? వెండి, బంగారు గిన్నెల్లో వండుతారని అనుకుంటాము కదా! కానే కాదు. ఆ మహిమాన్వితుడు కూడా అందరిలానే మామూలు మట్టి కుండలో వండిన ప్రసాదమే స్వీకరిస్తాడు ఇప్పటికీ. అందులోనూ కట్టెలపొయ్యి మీద వండితేనే ఆయనకి అత్యంత ఇష్టం. ఇది వందల ఏళ్లనాటి ఆచారం. సంపద పెరిగినా ఆయన అభిరుచి మారలేదు. ఒళ్ళంతా బంగారమే అయినా ఆయన మనసు మమతల మట్టే. శ్రీవారి సన్నిధికి ఆగ్నేయంలో అన్నప్రసాద తయారీ శాల ఉంది. అక్కడ కట్టెల పొయ్యి మీద మట్టికుండలో రోజూ ప్రసాదం తయారుచేస్తారు. దీనిని ఓడు ప్రసాదం అని కూడా అంటారు. ఇక్కడ తయారుచేసిన దద్ద్యోజనం స్వామివారికి నైవేద్యంగా పెడుతారు. తోమాల, అర్చన అనంతరం స్వామి ప్రసాదం స్వీకరిస్తాడు. తొలుత పుష్కరిణి వద్దవున్న వరాహస్వామికి ప్రసాద నైవేద్యం సమర్పించిన తరువాతనే స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ.
ఇదే విధంగా రాత్రి వేళలలో కూడా నైవేద్య కార్యక్రమం ఉంటుంది. వంటశాల వద్ద స్వామివారి తల్లి అయిన వకుళమాత పర్యవేక్షణలో ప్రసాదాలు తయారు చేస్తారు. ఏ బిడ్డకైనా అమ్మ చేతి వంట రుచే కదా నచ్చేది. మరి మొదటి నైవేద్యం కట్టెల పొయ్యిలో సరే, మరి మట్టి కుండలోనే ఎందుకు పెడుతారు అంటే ఈ కథ చదవాల్సిందే… ఇది వరకు తిరుమలలో తొండమాన్ చక్రవర్తి అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట. స్వామి వారికి చిరాకు వేసి తొండమాన్ చక్రవర్తికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట.
అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడు సమర్పించినవే అన్నాడట. అప్పుడు తొండమాన్ తన మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీరు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం. వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు? అప్పుడు భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి, కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు. కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు. అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు.వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట.
ఏ పని మొదలుపెట్టినా గోవింద నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట? అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట, వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు, నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను. ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం. భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానం లోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు. ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి. ఎక్కడ గర్వం, అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు. సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన. ఈశ్వరా ఇదంతానీ సృష్టే తండ్రి, నేను నీకు ఏమైనా ఇవ్వగాలనా అని అనుకోవాలుట. మరి నిజమే కదండీ.