మన దేశంలో షుగర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణం మనం తినే అలవాట్లు, జీవన విధానంగా చెపుతున్నారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలలో సైతం షుగర్ వ్యాధి సర్వ సాధారణంగా వచ్చేస్తోంది. ఇతర దేశాలలో కంటే కూడా మన దేశంలో టైప్ 2 డయాబెటీస్ తో బాధపడే రోగుల సంఖ్య అధికంగా వుందని తాజా గణాంకాలు చెపుతున్నాయి. ప్రతిరోజూ టాబ్ లెట్లు వేసుకునే దానికి బదులుగా ఇన్సలిన్ తీసుకోవడం కూడా రోగులు చేస్తున్నారు. స్వీట్లు వంటి తీపి పదార్ధాల కారణంగానే కాక, వ్యాధి ఒత్తిడితోను, వంశానుగతంగాను అధికంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ మందులు వేసుకునే కంటే కూడా ఈ వ్యాధిని నియంత్రించుకోడానికి కొన్ని ఆహారపుటలవాట్లను మార్చుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.
షుగర్ వ్యాధిని నివారించటానికి ఇంట్లోనే చేపట్టగలిగిన కొన్ని చర్యలు పరిశీలించండి. ఉదయంవేళ ఖాళీ కడుపుతో కాకర రసం తీసుకుంటే షుగర్ వ్యాధి అరికట్టవచ్చని రుజువైంది. రసంగానే కాకరకాయను కూరగాను, వేపుడుగాను కూడా వాడవచ్చు. ఒక చెంచా మెంతి గింజలు రాత్రంతా నానపెట్టి, ఉదయం దంతాలు బ్రష్ చేసిన తర్వాత వాటిని కొద్దిపాటి నీటితో నమిలి క్రమం తప్పకుండా ప్రతిరోజూ తింటే షుగర్ వ్యాధిని అరికట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. నేరేడు పండు షుగర్ వ్యాధికి మంచి మందుగా పని చేస్తుంది. అది నేరుగా పానిక్రియాస్ గ్రంధిపై ప్రభావం చూపుతుంది. వీటి విత్తనాలను ఎండబెట్టి, పౌడర్ చేసి నీటితో రోజుకు రెండు సార్లు తింటే మంచి ఫలితాలనిస్తుంది.
ఉసిరిక పండు రక్తంలోని షుగర్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది. కనుక ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాఫీ, టీ లవంటి వాటిలో షుగర్ కు బదులు ప్రత్యామ్నాయంగా తేనె వాడకం షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా షుగర్ లేని బ్లాక్ కాఫీ తాగితే టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలోకి వచ్చేస్తుంది. గ్రీన్ టీ కూడా బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను పెంచుతుంది. పై ఇంటి చిట్కాలతోపాటు రోజువారీ నడక, వ్యాయామం వంటి శారీరక చర్యలు షుగర్ వ్యాధి రోగులకు వ్యాధిని తగ్గించటంలో ఎంతో తోడ్పడతాయి.