Capsicum Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాప్పికం ఒకటి. ఇతర కూరగాయల వలె క్యాప్సికం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో క్యాప్సికం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని వివిధ రకాల వంటకాల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇతర వంటకాల్లో ఉపయోగించడంతో పాటు క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసే ఈ కూరను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాప్సికంతో రుచిగా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన క్యాప్సికం – పావు కిలో, తరిగిన చిన్న టమాటాలు – 4, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్.

మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు – ఒక టీ స్పూన్, లవంగాలు – 2, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క.
క్యాప్సికం కూర తయారీ విధానం..
ముందుగా జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీపుకోవాలి. తరువాత క్యాప్సికం ముక్కలను వేసి వేయించాలి. క్యాప్సికం ముక్కలు చక్కగా వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఈ టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉడికించాలి. తరువాత వేయించిన క్యాప్సికం, జీడిపప్పు వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కరివేపాకు, కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్, బిర్యానీ , నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇతర వంటల్లో వాడడంతో పాటు అప్పుడప్పుడూ ఇలా క్యాప్సికంతో కూరను తయారు చేసుకుని తినవచ్చు. ఈ కూరను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.