వేసవి వచ్చిందంటే చాలు… నోరూరించే మామిడి పండ్లు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వాటిలో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని తీపిగా ఉంటే కొన్ని రసాలు ఉంటాయి. ఇంకొన్ని మామిడి రకాలను పచ్చళ్లకు వాడుతారు. అయితే తినే మామిడి పండ్ల విషయానికి వస్తే మాత్రం వాటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రధానంగా విటమిన్ సి, ఎ, బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో మామిడి పండ్లను తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు కూడా. అయితే ఆరోగ్యంగా ఉన్న వారి వరకు ఓకే. కానీ మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారు మామిడి పండ్లను తినవచ్చా..? అంటే మాత్రం… అప్పుడు ఆ వ్యాధితో బాధపడుతున్న చాలా మందికి సందేహం వస్తుంది. అయితే… ఇంతకీ అసలు డయాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్లను తినవచ్చా..? లేదా..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక సాధారణ సైజ్ ఉన్న మామిడి పండు ద్వారా లభించే క్యాలరీలు, ఒకటిన్నర గోధుమ రొట్టెతో లభించే క్యాలరీలకు సమానం. కనుక మామిడి పండ్లను డయాబెటిస్ ఉన్న వారు తినవచ్చు. అయితే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన వెంటనే మాత్రం మామిడి పండ్లను తినరాదు. ఎందుకంటే భోజనం వల్ల అప్పటికే రావల్సినన్ని క్యాలరీలు మనకు లభిస్తాయి. ఈ క్రమంలో వెంటనే మామిడి పండును తింటే దాంతో లభించే క్యాలరీలు అన్నీ కొవ్వు కింద మారుతాయి. దీనికి తోడు రక్తంలో షుగర్ లెవల్స్ కూడా అమాంతంగా పెరుగుతాయి. అయితే మరి మామిడి పండ్లను డయాబెటిస్ ఉన్న వారు తినరాదా..? అంటే… తినవచ్చు. అందుకు ఓ పద్ధతి ఉంది.
ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ నడుమ లేదా మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ నడుమ ఉండే సమయంలో మామిడి పండ్లను తినవచ్చు. అది కూడా సగం మామిడి పండును మాత్రమే తినాలి. దీంతో ఎలాంటి సమస్యా రాదు. షుగర్ లెవల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. సాధారణంగా మామిడి పండు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువే. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఆహారం మనం తిన్న తరువాత అది రక్తంలో ఎంత సేపటికి కలిసి గ్లూకోజ్ మారుతుంది, ఎంత సేపటికి షుగర్ లెవల్స్ ను ప్రభావితం చేస్తుంది అనే ఓ కొలత. ఇది మామిడి పండ్లకు 100కు 56గా ఉంటుంది. అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ జాబితా ప్రకారం చూస్తే ఇది చాలా తక్కువే. కనుక మధుమేహం ఉన్న వారు నిర్భయంగా మామిడి పండ్లను తినవచ్చు. అయితే పైన చెప్పాం కదా… అలా తింటే బెటర్. దాంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.