గాయం అయినా, దెబ్బ తాకినా… ఎవరైనా ఏం చేస్తారు..? అవి చిన్నవే అయితే ఇంట్లోనే మందు వేసుకుంటారు. పెద్దవైతే హాస్పిటల్కు వెళ్లి డాక్టర్ చేత చికిత్స తీసుకుంటారు. అయితే గాయం లేదా దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా మన పెద్ద వారు ఏం చెబుతారంటే పప్పు తినకూడదని అంటారు. ఒక వేళ అలా తింటే గాయం ఇంకా పెద్దదవుతుందని, అస్సలు మానదని అంటారు. పప్పు తినకుండా ఉంటేనే అవి త్వరగా మానుతాయని చెప్పి మనకు అస్సలు పప్పు పెట్టరు. మరి ఈ విషయంలో అస్సలు నిజమెంత..? నిజంగానే పప్పు తింటే గాయం మానదా..? చీము ఎక్కువగా పడుతుందా..? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చీము అనేది నిజానికి చనిపోయిన తెల్ల రక్త కణాలే. మన శరీరంలో ఎక్కడైన గాయం అయినా, దెబ్బ తాకినా అక్కడ రంధ్రం ఏర్పడుతుంది కదా. చర్మం పోయి రక్తం బయటకు వస్తుంది. అయితే బయటి నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు గాను పెద్ద సంఖ్యలో తెల్ల రక్త కణాలు అక్కడికి చేరుకుని రక్షక భటుల పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో శరీరంలోకి ప్రవేశించాలని చూసే క్రిముల భరతం పడతాయి. ఆ ప్రక్రియలో చాలా వరకు తెల్ల రక్త కణాలు చనిపోతాయి. అయితే అవి మళ్లీ తయారవుతాయి లెండి. అది వేరే విషయం. అయితే… అలా చనిపోయిన తెల్ల రక్త కణాలే మనకు చీములా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి దాన్ని చూసి మనం భయపడతాం. చీము వస్తే గాయం ఇంకా పెద్దగా అవుతుందని అపోహకు గురి చెందుతాం. కానీ భయపడాల్సిందేమీ లేదు.
అయితే గాయం అయిన చోట ఓవైపు చనిపోతున్న తెల్ల రక్త కణాల స్థానంలో కొత్తవి ఏర్పడాలంటే అందుకు మనం మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు, మాంసం వంటివి తినాలి. దీంతో తెల్ల రక్త కణాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఆ క్రమంలో గాయం కూడా త్వరగా మానిపోతుంది. అంతేకానీ పప్పు తింటే చీము పడుతుందని, గాయం మానదని మాత్రం అనుకోకూడదు. పప్పు తింటేనే గాయం త్వరగా మానుతుంది. ఇప్పుడు మేం చెప్పిందంతా ఏదో గాలి వాటంగా ఊహించి రాసింది కాదు. వైద్యులు చెబుతున్నదే. కనుక గాయం అయిన వారు నిరభ్యంతరంగా పప్పు తినండి. దాంతో అవి త్వరగా మానుతాయి..!