త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరునికి చాలా మంది భక్తులే ఉంటారు. కేవలం ఆయన నామ స్మరణ చేస్తే చాలు పరవశించి పోతాడని పండితులు చెబుతారు. అందుకనే భూత ప్రేత పిశాచ రాక్షసాది గణాలు మొదలుకొని మానవులు, దేవతలు కూడా చాలా మంది శివారాధన చేస్తుంటారు. పిలిస్తే పలికే దైవంగా శివుడు మారి భోళా శంకరుడిగా అడగ్గానే వరాలు ఇస్తుంటాడు. అయితే శివున్ని ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తరం చదవాలని పండితులు చెబుతుంటారు. కానీ 108 నామాలను చదవాలంటే చాలా ఓపిక, సమయం ఉండాలి. పైగా తప్పులు లేకుండా చదవాలి. అది చాలా కఠినమైంది. అయితే అష్టోత్తరం చదవలేమని అనుకునే వారు కేవలం 8 శివ నామాలను ఉచ్చరిస్తే చాలు, అష్టోత్తరం చదివినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.
పరమశివునికి పూజ చేసేటప్పుడు, శివ అష్టోత్తరంతో (108 నామాలు) పూజ చేయాలి. ఒకవేళ పూజకు సమయం లేక, ఏదో కారణం చేత సమయం లేకుంటే అప్పుడు ఎనిమిది నామాలతో చేస్తే శివ పూజ పూర్తి అయినట్టే.
శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఈ ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు.
1)భవాయ దేవాయ నమః, 2)శర్వాయ దేవాయ నమః, 3)ఈశానాయ దేవాయ నమః, 4)పశుపతయే దేవాయ నమః, 5)రుద్రాయ దేవాయ నమః, 6)ఉగ్రాయ దేవాయ నమః, 7)భీమాయ దేవాయ నమః, 8)మహతే దేవాయ నమః. ఈ ఎనిమిది నామముల చేత శివపూజ పూర్తి అయిపోతుంది. మీరు కోరిన వరాలను శివుడు అందజేస్తాడు.