భారతదేశంలో ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆయా ఆలయాలు పురాతన కాలం నుంచి భక్తుల నమ్మకాలకు, విశ్వాసాలకు నెలవుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఆలయాలకు వెళ్లే భక్తులు విభిన్న రీతిల్లో దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చమని దైవాలను ప్రార్థిస్తుంటారు. అవి నెరవేరిన వెంటనే వచ్చి మొక్కు తీర్చుకుంటుంటారు. రాజస్థాన్లోని రణథంబోర్లో ఉన్న వినాయక దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కాకపోతే అక్కడ గణేషున్ని భక్తులు విభిన్నమైన రీతులలో ప్రార్థిస్తారు.
రణథంబోర్లో కొలువై ఉన్న విఘ్నేశ్వరుడు భక్తులు కోరిన కోరికలను తీర్చే ఇష్ట దైవంగా పేరుగాంచాడు. సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ భక్తులు దైవం ఎదుట నిలబడి తమ కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తారు. కానీ ఆ వినాయక ఆలయంలో మాత్రం భక్తులు తమ కోరికలను తీర్చమని దైవానికి ఉత్తరం ద్వారా తెలియజేస్తారు. కేవలం కోరికలను నెరవేర్చమనే కాదు, తమ తమ ఇండ్లలో జరగనున్న శుభాకార్యాలకు కూడా భక్తులు గణేషున్ని ఆహ్వానిస్తూ ఉత్తరాలు పంపుతారు. కోరికలు నెరవేర్చుకున్న భక్తులు వినాయకుడికి కృతజ్ఞతలు చెబుతూ కూడా ఉత్తరాలు రాస్తారు. అలా ఆ ఆలయానికి నిత్యం దాదాపు 20 కేజీలకు పైగా ఉత్తరాలు వస్తాయట. వాటన్నింటినీ పూజార్లు ఓపిగ్గా స్వామి ముందు చదివి వినిపిస్తారట. అనంతరం వాటన్నింటినీ స్వామి పాదాల వద్ద ఉంచుతారట. రణథంబోర్ గణేషున్ని ప్రార్థిస్తే తమ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
రణథంబోర్ గణేష్ టెంపుల్ను 10వ శతాబ్దంలో హమీర్ అనే రాజు నిర్మించాడని చెబుతారు. ఆ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే రాజుతో యుద్ధం జరిగినప్పుడు హమీర్ రాజ్యంలోని ఖజానాలో ఉన్న సామగ్రి అంతా తుడిచి పెట్టుకుపోయిందట. దాదాపు 7 ఏళ్లుగా యుద్ధం జరగగా హమీర్ ఇక తనకు ఓటమి తప్పదని అనుకున్నాడు. అయితే హమీర్ వినాయకుడికి గొప్ప భక్తుడట. ఈ కారణంగా ఓ రోజు విఘ్నేశ్వరుడు హమీర్కు కలలో కనిపించి తెల్లారితే యుద్ధం ఆగిపోతుంది, నువ్వే గెలుస్తావు, అన్ని సమస్యలు తొలగిపోతాయి అని చెప్పాడట. ఆశ్చర్యంగా మరునాడు అలాగే జరిగిందట. దీంతోపాటు హమీర్ కోట గోడకు చెక్కిన శిల్పంలా విఘ్నేశ్వరుడి ప్రతిమ ఒకటి స్వతహాగా వెలసిందట. ఆ విగ్రహానికి మూడు కళ్లు (త్రినేత్ర) ఉన్నాయట. కాగా ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే హమీర్ అక్కడ ఆలయాన్ని నిర్మించాడట. అదే ఆలయం ఇప్పుడు కొన్ని వేల మంది భక్తుల కొంగు బంగారంగా మారిందట.
అయితే ఆ వినాయకుడి విగ్రహానికి 3 కళ్లు ఉండడం వల్ల త్రినేత్ర విఘ్నేశ్వరుడని స్వామిని అందరూ పిలుస్తారు. ఇలా మూడు కళ్లు కలిగిన వినాయకుడి దేవాలయాల్లో రణథంబోర్ దేవాలయమే మొదటిదిగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయంలో ఇంకో విశేషమిటంటే వినాయకుడి ఇద్దరు భార్యలు సిద్ధి, రిద్ధి, ఆయన కుమారులు శుభ్, లభారేలు, ఆయన వాహనం మూషికం విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉంటాయట. అలా వినాయకుడు, ఆయన కుటుంబ సభ్యుల విగ్రహాలు ఉన్న ఏకైక దేవాలయంగా రణథంబోర్ గణేష్ ఆలయం పేరుగాంచింది. మీరూ వినాయకుడి భక్తులైతే రణథంబోర్ గణేష్ ఆలయానికి మీ ఉత్తరాలు కూడా పంపవచ్చు. ఏవైనా కోరికలు ఉంటే స్వామిని ప్రార్థించవచ్చు.
రణథంబోర్ గణేష్ ఆలయ చిరునామా: రణథంబోర్ త్రినేత్ర గణేష్ టెంపుల్, సవాయ్ మధోపూర్, రాజస్థాన్ – 322021.