సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం లో 1935 జూలై 25న జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సత్యనారాయణ పలు నాటకాలలో పాత్రలు పోషించారు. 1959లో సిపాయి కూతురు సినిమాలో తొలుత అవకాశం వచ్చింది. తెలుగు తెరపై ఆయన ఎన్నో పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే అన్ని పాత్రల కంటే యముడి పాత్ర ప్రత్యేకం. నరకాధిపతి యముడి పాత్రలో నటించిన ఆహార్యం, వాచకం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్నాయి.
యముండా, ధూంతత అనే పదాలతో.. యముడు అంటే ఇంత గంభీరంగా ఉంటాడు కాబోలు అనిపించారు. యమగోల, యమలీల, యముడికి మొగుడు, పిట్టలదొర ఇలా ఏ సినిమాలో అయినా యముడి పాత్ర వేయాలంటే కైకాల తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంతగా తన మార్క్ ని చూపించారు.
అసలు యముడు అంటే కైకాల సత్యనారాయణలాగే ఉంటాడేమో అనిపించేంతలా తనదైన బ్రాండ్ సృష్టించారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ చిత్రంలో మాత్రం యముడి పాత్రలో అవకాశం వచ్చినా ఆయన నటించలేదు. యమదొంగ చిత్రంలో యముడు పాత్రకు తనని సంప్రదించారని అప్పట్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కైకాల సత్య నారాయణ తెలిపారు. డబ్బుల విషయంలో తేడా రావడంతో నేను చేయనని చెప్పానని అన్నారు కైకాల. ఇక వెండితెరపై ఆయన చివరి సినిమాలో క్యారెక్టర్ కూడా యముడి పాత్ర కావడం విశేషం. కార్తీక్ రాజు కథానాయకుడిగా నటించిన దీర్ఘాయుష్మాన్ భవ సినిమాలో కైకాల యముడి పాత్ర పోషించారు.