భారతీయులు ధనియాలను ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. వీటిని పొడిగా చేసి వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. వేపుళ్లు, స్నాక్స్, అల్పాహారం, మాంసాహారాల్లో ధనియాల పొడి ఎక్కువగా వేసి వండుతుంటారు. అయితే ధనియాల్లో నిజానికి అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ధనియాలతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు బాగా పనిచేస్తాయి. గజ్జి, చర్మంపై దురదలు, దద్దుర్లు, వాపులను తగ్గించడంలో ధనియాలు ఉపయోగపడతాయి. వీటిల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల నోట్లో పుండ్లు, పొక్కులను తగ్గిస్తాయి. నోటి అల్సర్లు కూడా తగ్గుతాయి. ధనియాల్లో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నొప్పిని తగ్గిస్తుంది. ఇర్రిటేషన్ సమస్య నుంచి బయట పడేలా చేస్తుంది.
2. ధనియాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ఓ అధ్యయాన్ని కూడా ప్రచురించారు. దాని ప్రకారం ధనియాల పొడిని రోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. వీటిల్లో యాంటీ హైపర్ గ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే శరీరం ఇన్సులిన్ను గ్రహించేలా చేస్తాయి. దీంతో షుగర్ తగ్గుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
3. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, ఇతర పలు కారణాల వల్ల చాలా మందిలో జుట్టు రాలుతుంటుంది. పోషకాహార లోపం కూడా ఇందుకు కారణమవుతుంది. కానీ ఈ సమస్యను తగ్గించడంలో ధనియాలు బాగా పనిచేస్తాయి. ధనియాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
4. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అలాగే ధనియాల్లో ఉండే సమ్మేళనాలు జీర్ణశక్తిని పెంచుతాయి. గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. ప్రేగులు మొత్తం శుభ్రమైపోతాయి.
5. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ధనియాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
6. చర్మాన్ని సంరక్షించేందుకు విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. ధనియాల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బీటా కెరోటిన్లతోపాటు విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది దగ్గు, జలుబు, ఫ్లూలను తగ్గిస్తుంది.
7. కొందరు మహిళలకు నెలసరి సమయంలో రక్తస్రావం అధికంగా అవుతుంది. అలాంటి వారు ధనియాలను తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇవి ఎండోక్రైన్ గ్రంథులను ఉత్తేజ పరుస్తాయి. దీంతో హార్మోన్లు సమతుల్యం అవుతాయి. రుతు సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.
ధనియాలను కొద్దిగా వేయించి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఆ పొడిని రోజూ 2-4 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. రోజూ తినే ఆహారాలపై చల్లుకుని ధనియాల పొడిని తీసుకోవచ్చు. లేదా కొన్ని ధనియాలను నీటిలో మరిగించి ఆ నీటిని రోజుకు 2 సార్లు కప్పు మోతాదులో తాగాలి. దీని వల్ల కూడా పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365