కొంత మంది చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో ఎండలో కాసేపు తిరిగితే చాలు, వెంటనే ముఖం నల్లగా మారిపోతుంది. అలాగే కాలుష్యం, ఇతర కారణాల వల్ల కూడా ముఖంపై నలుపు దనం పెరిగిపోతుంది. దీన్నే ట్యానింగ్ అని కూడా అంటారు. కానీ దీనికి ఇంట్లో దొరికే పెసరపిండితోనే పరిష్కారం ప్రయత్నించొచ్చు.
ముఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే మూడు చెంచాల పెసరపిండి తీసుకోవాలి. దీనిలో అరకప్పు గులాబీ నీరు, మూడు చెంచాల రోజ్ ఆయిల్, చెంచా పంచదార కలిపి పేస్ట్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కాస్త పాలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. పావుగంటయ్యాక నీళ్లతో చేతులు తడుపుకొంటూ మృదువుగా రుద్దాలి. ఇలా కనీసం వారంలో ఒకటి రెండు సార్లు చేస్తే మీ సమస్య దూరమవుతుంది.
కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. ఇలాంటివారు పెసరపిండి, తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది. చర్మంపై నలుపుదనం క్రమంగా తగ్గుతుంది.
నాలుగు చెంచాల పెసరపిండిలో గుప్పెడు గులాబీ రేకులు, కొద్దిగా పాలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి కాస్త బాత్ సాల్ట్ చేర్చుకుని ఒంటికి రుద్దుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, దుమ్ము, ధూళి మృతకణాలు తొలగిపోతాయి. చర్మం నునుపుగా మారుతుంది.