షుగర్ వ్యాధి వచ్చిన వారు తరచుగా మూత్రం పోస్తారు. దాహం అధికంగా వుంటుంది, ఆకలి ఎక్కువ, బరువు తగ్గుతారు. అలసట అధికం, చేతులలో, కాళ్ళలో చురుక్కుమంటూ మంటలు పుడుతుంది. చూపు మందగిస్తుంది. తరచుగా వ్యాధులకు గురవుతుంటారు. గాయాలు మొదలైనవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి దేశంలో షుమారు 51 మిలియన్ల ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య మరింత అధికం అయ్యే అవకాశాలు కూడా వున్నాయని రీసెర్చర్లు చెపుతున్నారు.
అంచనాల మేరకు రాబోయే 20 సంవత్సరాలకాలంలో దేశ జనాభాలో 8 శాతం వరకు షుగర్ వ్యాధి కలిగి వుండే అవకాశాలున్నాయని వీరు చెపుతున్నారు. పెరుగుతున్న అబివృద్ధి కారణంగా అంచనాలకు మించి ఈ వ్యాధి వ్యాప్తి చెందగలదని ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ మన దేశాన్ని హెచ్చరించింది. రాబోయే సంవత్సరాలలో మన దేశం డయాబెటిక్ నివారణకు ప్రతి ఏటా 125 బిలియన్ల రూపాయలు వ్యయం చేయాల్సిన అవసరం వుంటుందని తెలుపుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధితో ఏటా సుమారు 4 మిలియన్ల జనాభా మరణిస్తున్నారని వెల్లడైంది. ఈ వ్యాధి సత్వర నివారణకుగాను పరిశోధకులు తమవంతు కృషి చేస్తూనే వున్నారు.