మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు పట్టాలను చూసినప్పుడు గానీ ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు. అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. అయితే రైలులో జనరల్ బోగీలు ముందు లేదా చివర ఉంటాయి. కారణమేంటో తెలుసా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే అధికారుల ప్రకారం, మిగతా కోచ్ లలో కంటే జనరల్ బోగీలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ప్రతి స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇందులో ఎక్కుతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కోచ్ లను రైలు మధ్యలో పెడితే మొత్తం వ్యవస్థనే కుప్పకూలుతుంది. మిగిలిన కోచులలోని ప్రయాణికులు హాయిగా దిగలేరు లేదా రైలు ఎక్కలేరు. అంతే కాదు జనరల్ బోగీలలో స్థలం లభించకపోతే ఆ ప్రయాణికులు ఇతర కోచ్ లలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. అందుకే జనరల్ కోచ్ లను సాధారణంగా రైలు ప్రారంభంలో లేదా చివరిలో ఉంచుతారు.
రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్ ని ఉంచడానికి మరొక కారణం ఏంటంటే, ప్రమాదం జరిగినప్పుడు అది రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్లలో సహాయపడుతుంది. రైలు మధ్యలో జనరల్ కోచ్ ను ఉంచినట్లయితే రద్ది ఎక్కువగా ఉండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్ లను ఏర్పాటు చేస్తారు. అలాగే టిక్కెట్ ధర ఎక్కువ చెల్లించే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా రైలు జనరల్ బోగీలను ముందు లేదా చివర్లో ఉంచుతాయి. జనరల్ బోగీ టిక్కెట్ ధర తక్కువ. ఏసీ బోగీ టిక్కెట్ ధర ఎక్కువ. కనుక ఏసీ ప్రయాణిల కోసం వారికి ఉపయోగపడేలా వారి బోగీలను మధ్యలో ఉంచుతారు. దీంతో జనరల్ బోగీలను సహజంగానే ట్రెయిన్ కు ముందు లేదా చివర్లో ఏర్పాటు చేయాల్సి వస్తుంది.