శారీరకంగా, మానసికంగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది. అలుపు, మత్తు, నిద్రమత్తు, నిస్సత్తువ లాంటివన్నిటినీ అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది. మన ఆరోగ్యం పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనం తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది. అలసటను అధిగమించడానికి అవసరమయ్యే ఆహారపదార్ధాలు, పాటించాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టిఫిన్ తప్పనిసరి. ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉండడం వల్ల మనకు తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజ్, పోషకాలు అందవు. దీంతో నీరసం ఏర్పడుతుంది. చిన్న పనిచేసినా అలసిపోతారు. కనుక కచ్చితంగా ఉదయం టిఫిన్ తినాలి.
లంచ్లో భాగంగా శక్తి, పోషణ ఇచ్చే ఆహారాలను ఎక్కువగా తినాలి. లంచ్లో కాస్త ఆహారం ఎక్కువ తిన్నా ఫర్లేదు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఇవి చురుకుదనాన్ని అందిస్తాయి. మానసిక శక్తిని పెంపొందిస్తాయి. రోజంతా నీళ్లను సరిగ్గా తాగకపోయినా కూడా అలసట, నీరసం వస్తాయి. కనీసం 8 గ్లాసుల నీళ్లను అయినా తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది.
మరీ అధికంగా ఉపవాసం చేస్తే శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. వారంలో ఉపవాసం ఒక రోజు చేస్తే సరిపోతుంది. అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాలను కూడా ఎప్పుడో ఒకసారి తీసుకోవాలి. రోజూ తింటే ఆరోగ్యానికి హాని చేస్తాయి. శరీరం బద్దకంగా మారేలా చేసి అలసటను కలిగిస్తాయి. అన్ని పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తింటే అలసట, నీరసం ఉండవు. మిల్లెట్స్, తృణ ధాన్యాలు, పండ్లు, నట్స్, విత్తనాలు, కోడిగుడ్లు, చేపలు వంటి ఆహారాలను తరచూ తినాలి. చిరు తిండ్లను తినడం తగ్గించాలి. బదులుగా పెసలు, శనగలను ఉడకబెట్టి తినాలి. మొలకలను కూడా తినవచ్చు.
కెఫీన్ అధికంగా ఉండే టీ, కాఫీలను తాగడం తగ్గించాలి. బదులుగా హెర్బల్ టీలను సేవిస్తుండాలి. ఇవి శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. ఉత్సాహంగా ఉండేలా చూస్తాయి. పెరుగును రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. రాత్రి పూట పెరుగు వద్దు అనుకుంటే పాలను తాగాలి. ఇది మరుసటి రోజు మనల్ని ఉత్సాహంగా మారుస్తుంది. విటమిన్ సి ఉండే ఆహారాలను తింటున్నా కూడా శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇవి నీరసం, అలసటను దూరం చేస్తాయి.