అది తెనాలిలోని బాలాజీరావు పేట.. అక్కడ రైల్వే స్టేషన్ వీధిలో మెఘావత్ చిరంజీవి పానీ పూరి అమ్ముతుంటాడు.. ఆర్థికంగా ఇబ్బందులు పడినా ప్రేవేటు వడ్డీ వ్యాపారుల వద్ద వడ్డీకి డబ్బులు తీసుకునేవాడు కాదు. అయితే మెప్మా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే చిరంజీవి ఆ సంస్థ ఇప్పించే బ్యాంక్ రుణాలనే తీసుకునేవాడు. అలా 2021లో 10 వేలు, 2022లో 20 వేలు, 2023లో50 వేల రూపాయల చొప్పున రుణం తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు వాటిని సకాలంలో చెల్లించాడు. దీంతో చిరంజీవికి తెనాలి మెప్మాలో మంచి పేరొచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారులే బ్యాంక్ రుణాలు తీసుకొని ఎగ్గొడుతున్న రోజుల్లో తన వ్యాపారాభివృద్దికి దోహదం చేస్తున్న బ్యాంకులకు సకాలంలో రుణం చెల్లించి చిరంజీవిని బ్యాంకు అధికారులు సైతం మెచ్చుకునే వారు.
అంతేకాదు చిరంజీవి తన బండి వద్ద డిజిటల్ పేమెంట్స్ తీసుకునేవాడు. చిన్న బండి వద్ద డిజిటల్ పేమేంట్స్ తీసుకునే విధంగా బ్యాంక్ అధికారులు అతన్ని ప్రోత్సహించారు. ఇవన్నీ ఇలా ఉండగా గతంలో తెనాలి పోస్ట్ ఆఫీస్ కు చెందిన అధికారులు చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చారు. ఇంటికి వచ్చిన వారిని చూసి మొదట చిరంజీవి కంగారు పడ్డాడు. అయితే వచ్చిన అధికారులు పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన వారని తెలుసుకొని ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. అంతే.. వారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు. స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ముర్ము పంపిన ఆహ్వానాన్ని అధికారులు చిరంజీవి చేతికి అందించారు. దీంతో తనకే ఎందుకు ఆహ్వానం అందిందంటూ ప్రశ్నించాడు.
మెప్మాలో రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించడమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిని గుర్తించి రాష్ట్రపతి ఆహ్వానం పంపినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయన ఆనందం మరింత ఎక్కువైంది. ఢిల్లీ వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. స్వయంగా రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై ఆయన కుటుంబం హర్షం వ్యక్తంచేసింది.