పాలు తాగితే ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందువల్ల పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. చిన్నారులకు రోజూ పాలను తాగించాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే పాలను తాగితే గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు పలువురు పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తల్లిపాల తర్వాత గేదె లేదా ఆవుపాలు మంచి పోషకాహారమని చిన్నప్పటినుండి ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు. తాగిస్తారు.
ప్రతిరోజూ మూడు గ్లాసుల పాలు తాగితే 20 శాతం వరకు గుండె సంబంధిత సమస్యలు దూరంగా వుంటాయని తాజాగా హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలలో తేలింది. పరిశోధకులు తమ పరిశోధనలు వివిధ దేశాలలోని ప్రజలపై చేశారు. కొవ్వు పదార్ధాలు తక్కువగా గల పాలను తీసుకోవడం ద్వారా గుండెపోటు దూరమవుతుందని అధ్యయనంలో తేలింది. పోషకాలతో కూడిన పాల ఉత్పత్తులను తీసుకోవడం కూడా సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తుందని, మంచిదేనని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం పాలలోని వెన్న వంటి పదార్ధాలను తీసివేసి తాగుతున్నారని, అయితే వీటి ప్రయోజనం కూడా కొంత వయసు వరకు వుంటుందని, ఒక వయసు తర్వాత శరీరంలో పాలను జీర్ణం చేసే ఎంజైములు కరువవుతాయని వీరు చెపుతారు.
పరిశోధకులు తమ అధ్యయనాన్ని షుమారు రెండేళ్ళపాటు 300 మంది పురుషులు, మహిళలపై నిర్వహించారు. ప్రతిరోజూ వారికి మూడు గ్లాసుల పాలు ఇచ్చి వారిలోని కొవ్వు, కాల్షియం స్ధాయిల శాతాన్ని పరిశీలించారు. పాలను రెగ్యులర్ గా తాగటం వలన గుండెసంబంధిత సమస్యలే కాక, కేన్సర్ వంటి మొండి వ్యాధులు కూడా దూరమవుతాయని వారు నిర్ధారించారు.