చూసేందుకు చక్కని ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ఈ పండ్లను తింటే అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు వరమని వారు అంటున్నారు. మధుమేహం ఉన్నవారు స్ట్రాబెర్రీలను తింటుంటే షుగర్ లెవల్స్ను నియంత్రణలో ఉంచుకోవచ్చని అంటున్నారు.
అందరిని ఆకర్షించేదిగా వుంటూ విరివిగా దొరికే స్ట్రాబెర్రీస్ డయాబెటీస్ వ్యాధిని నిరోధించడం, లేదా నియంత్రించడమే కాక వయస్సు మీద పడకుండా కూడా చేస్తుందని ఒక తాజా పరిశోధనలో తేలింది. ఈ స్ట్రాబెర్రీ పండ్లను తినడం వలన రక్తంలోని యాంటీ ఆక్సిడెంట్ స్ధాయి పెరుగుతుందని పరిశోధకులు చెపుతున్నారు. ఒత్తిడిపై పోరాడే యాంటీ ఆక్సిడెంట్ లు అధికంగా వుండటం చేత ఈ పండ్లు తినేవారు వయస్సు తక్కువగా కనిపించడంతో పాటు డయాబెటీస్, కేన్సర్, గుండె సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు.
ఇటలీకి చెందిన పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులకు అర కిలో స్ట్రా బెర్రీలను ఇవ్వడం ద్వారా ఈ విషయాలను పరిశోధించారు. క్రమం తప్పకుండా ఈ పండ్లను తింటే రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల స్ధాయి బాగా పెరిగి రోగ నిరోధక వ్యవస్ధ మెరుగుపడుతుందని వెల్లడయింది. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తరచూ తినాలని వారు సూచిస్తున్నారు.