వెల్లుల్లిని నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దీంట్లో మనకు ఆరోగ్యాన్ని కలిగించే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని కూడా అందరికీ తెలుసు. అయితే వెల్లుల్లిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవచ్చా..? తీసుకుంటే ఏమవుతుంది..? తెలుసుకుందాం రండి. వెల్లుల్లిని భోజనం చేసిన తరువాత కంటే ఉదయాన్నే పరగడుపున తీసుకుంటేనే ఎక్కువ ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. కొన్ని వెల్లుల్లి రేకుల్ని తీసుకుని ఉదయాన్నే అలాగే పచ్చిగా తింటే దాని వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. వెల్లుల్లిలో సహజంగా ఉండే యాంటీ బయోటిక్ గుణాలను పూర్తిస్థాయిలో పొందాలంటే వెల్లుల్లిని ఉదయం పూట పరగడుపునే తీసుకోవాలట.
నిత్యం వెల్లుల్లిని ఇలా తీసుకుంటే దాని వల్ల మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుందట. ప్రధానంగా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఉన్న వివిధ రకాల అనారోగ్యాలను దూరం చేస్తాయట. బీపీని తగ్గించడంలోనూ వెల్లుల్లి బాగానే పనిచేస్తుంది. పరగడుపున వెల్లుల్లి తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో ఉన్న వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. రక్తం గడ్డకట్టకుండా నిరోధించే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిలోని ఔషధ కారకాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి. నరాల బలహీనతలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాంటి అనారోగ్యాలు ఉన్నా వెల్లుల్లి ద్వారా తగ్గించుకోవచ్చు.
రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. ఇన్ఫెక్షన్లు దరి చేరవు. వైరస్లు, బాక్టీరియాలతో పోరాడే ఔషధ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. రక్తనాళ్లాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. జీర్ణాశయ సంబంధ సమస్యలను, ప్రధానంగా డయేరియాను తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి. ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది. పచ్చి వెల్లుల్లి రేకుల్ని బాగా నలిపి తింటే ఇంకా మంచిదట. దీని వల్ల వాటిలో ఉండే ఔషధ గుణాలు ఇంకా పెరుగుతాయట. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం దీన్ని తినకూడదట. ఇతరులెవరికైనా చర్మంపై దురదలు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వారు కూడా వెల్లుల్లిని తినడం ఆపి తక్షణమే వైద్యున్ని సంప్రదించాలట.