మీరు ఇచ్చిన పరిమిత వివరాల ప్రకారం మీ భర్త వీలునామా రాయలేదు అనిపిస్తుంది. కానీ ఇల్లు మీ భర్త పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉంది అనుకుంటున్నాను. సాధారణంగా జరిగేది ఏమిటంటే. మీరు మీ గ్రామం, పట్టణం లో ఉన్న రెవిన్యూ, మునిసిపల్ అధికారిని కలిసి ఫ్యామిలీ ట్రీ (వంశ వృక్షం) సర్టిఫికెట్ తీసుకోండి. పని కాకుంటే, అవసరమయితే, మీ ప్రాంతంకు ఎన్నుకోబడ్డ వార్డ్ మెంబెర్, కౌన్సిలర్, MLA లేక MP ని అయినా కలవండి. ఇలాంటి వాటికి సహాయం చేయటం వారి వృత్తి ధర్మం. చాలామంది చేస్తారు. వారకీ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది కదా! లేదంటే ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో అర్జీలు తీసుకుంటారు. అక్కడ మీ సమస్య విన్నవించండి. మీ భర్త మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) కూడా తీసుకోవాలి. మీ ఇంటి పత్రం కాపీ(మీ భర్త పేరులో ఉన్నది), ఫ్యామిలీ ట్రీ, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ లు జత చేసి గ్రామ సచివాలయం, మునిసిపల్ ఆఫీస్ లో మ్యుటేషన్ (mutation) కు అర్జీ ఇవ్వండి.
ప్రభుత్వం రికార్డుల్లో ఆ ఇంటి పైన మీ పేరు వస్తుంది. ఇంటి పన్ను మీ పేరులో వస్తుంది గాని, మీ పేరులో రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం లేదు. కాకపోతే మీ అత్త (జీవించి ఉంటే), మీ పిల్లలు అందరు మ్యుటేషన్ కు సమ్మతం తెలపాలి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం భార్యకు, తల్లికి, పిల్లలకు తప్ప వేరే ఎవ్వరికి ఆ ఇంటిపైన హక్కులు ఉండవు. (పిల్లలలో, పెళ్లి అయి చనిపోయిన కొడుకు ఉంటే మాత్రం అతని భార్య కు కూడా వారసత్వ హక్కు ఉంటుంది). మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా అని అడుగుతున్నారు. మీకు ఎవరు చేయిస్తారు? అతను చనిపోయారు కదా! రిజిస్ట్రేషన్ చేయటానికి ఆ ఆస్తి యజమాని, చేయుంచుకోవటానికి మీరు, ఇద్దరూ ఉండాలి.
అలా కాదు మీకు రిజిస్ట్రేషన్ పత్రమే కావాలనుకుంటే, మీ అత్తగారు, మీ పిల్లలు కలిసి మీకు వారి హక్కు విడుదల పత్రం (Relinquishment Deed)జిస్టర్ చేయించాలి. అప్పుడు ఈ కొత్త పత్రం, మీ భర్త పేరుతో ఉన్న పాత పత్రం మరియు ఫ్యామిలీ ట్రీ సర్టిఫికెట్ కలిసి మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అవుతుంది. కానీ సాధారణంగా గొడవలు లేక అనుమానాలు ఏమీ లేకపోతే ఆ అవసరం ఉండదు. నేను ముందు చెప్పిన విధంగా మ్యుటేషన్ మాత్రమే సరిపోతుంది. హక్కు విడుదల రాయించుకున్నా గానీ మ్యుటేషన్ చేయించుకోవటం తప్పనిసరి. నా అభిప్రాయం ప్రకారం అయితే గొడవలు, సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే, వకీలుతో అవసరం ఉంటుంది. సాధారణంగా ఆ అవసరం రాకూడదు.