డయాబెటీస్ వ్యాధి శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ పై ప్రభావిస్తుంది. మనం తినే ఆహారం గ్లూకోజ్ లేదా షుగర్ గా మారి మన శరీరాలకవసరమైన శక్తినిస్తుంది. పొట్ట భాగంలో వుండే పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసి గ్లూకోజ్ ను శరీర కణాలలోకి చొప్పిస్తుంది. డయాబెటీస్ వ్యాధి వున్న వారికి శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. లేదా ఉన్న ఇన్సులిన్ సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు. ఈ కారణంగా శరీరంలో షుగర్ నిల్వలు పెరిగిపోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పెరిగి జీవప్రక్రియ లోపించి శరీరంలోని ప్రధాన అవయవాల చర్యలు సమర్ధత కోల్పోతాయి. ఈ పరిస్ధితిని కనుక వైద్యం చేయకుండా అలానే వదిలేస్తే, డయాబెటీస్ వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతుంది.
గుండె వ్యాధులు, కండ్లకు చూపు మందగించటం, కిడ్నీలు విఫలమవటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. డయాబెటీస్ రెండు రకాలుగా వస్తుంది. మొదటిది టైప్ 1. దీనికి ఇన్సులిన్ తీసుకోవడమే మార్గము. ఇది పిల్లలలో వచ్చే వ్యాధి. ప్రారంభంలోని పాన్ క్రియాటిక్ సెల్స్ నష్టం అయి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కనుక వీరికి ఇన్సులిన్ ఎక్కించడమే చేయాలి. లక్షణాలు ఎలావుంటాయంటే, రక్తంలో, మూత్రంలో షుగర్ లెవెల్ పెరగడం, తరచుగా మూత్రం పోయడం, ఆకలి, దాహం, బరువు తగ్గటం, బలహీనం, అలసట, భావోద్రేకాలు, వికారం, వాంతులు మొదలైనవి.
టైప్ 2 డయాబెటీస్ – వీరికి ఇన్సులిన్ ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి లేదా అధిక బరువున్న వారికి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు, దాహం, మూత్రం అధికంగా పోయటం, అలసట, చికాకు, వికారం, చర్మంపై ఇన్ ఫెక్షన్, చూపు మందగించడం, పొడిచర్మం, చర్మం చురుక్కు మనటంగా వుంటాయి.